తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్ రాష్ట్ర ప్రతినిధి.. జూలై 22(బుధవారం) బోనం అనే పదం భోజనం అనే సంస్కృత పదం నుండి ఉద్భవించింది .ఇది సాక్షాత్తు జగన్మాత అయిన మహాకాళి దేవి కి భక్తులు సమర్పించే కృతజ్ఞత నైవేద్యం..
బోనాల పండుగ వెనకాల ఉన్న చరిత్ర.... 1813 వ సంవత్సరంలో హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో భయంకరమైన ప్లేగు వ్యాధి వ్యాపించి వేలాదిమంది ప్రాణాలను ఈ మహమ్మారి బలిగొంది .దీంతో ఆ సమయంలో మిలటరీ బెటాలియన్ కు చెందిన కొందరు తెలంగాణ ప్రజలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని తమ ఊరిని ఈ మహమ్మారి నుండి కాపాడితే ప్రతి ఏటా ఘనంగా పూజలు చేస్తామని మొక్కుకున్నారు .దీంతో అప్పుడు ఈ మహమ్మారి పూర్తిగా నశించి పోవడంతో ప్రజలు ఆనవాయితీగా ప్రతి ఏటా ఆషాడ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కలు తీర్చుకోవడం ఆనవాయితీ.
పురాణ నమ్మకం... హిందూ సాంప్రదాయం ప్రకారం కొత్తగా పెళ్లయిన అమ్మాయిలు ఆషాడ మాసంలో తమ పుట్టింటికి రావడం ఆనవాయితీ దీంతోపాటే జగన్మాత అయిన అమ్మవారు మహాకాళి కూడా ఆషాడ మాసంలో తన పుట్టింటికి భూలోకానికి వస్తుందని భక్తుల నమ్మకం పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డను ఆదరించినట్లుగా భక్తులు అమ్మవారిని తమ సొంత బిడ్డగా భావించి ప్రేమతో అన్నం పాలు బెల్లం పెరుగులతో వండిన బోనాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక ఆకర్షణగా బోనాల పండగ... ప్రతి ఏటా బోనాల పండుగను తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో ప్రత్యేక భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తుంటారు .దీంతో బోనాల పండగ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. తొలి బోనం ప్రతి ఏటా ఆషాడ మాసంలో గోల్కొండ కోటలోని జగదాంబ అమ్మవారికి సమర్పిస్తారు .ఆ తర్వాతే నగరమంతా ప్రజలు బోనాల పండుగను జరుపుకుంటారు.
పోతురాజుల వేషధారణ... ఈ బోనాల ఉత్సవాలలో ప్రధాన ఆకర్షణగా పోతురాజుల వేషధారణ నిలుస్తుంది. అమ్మవారికి బోనాలు సమర్పించే సమయంలో తమ్ముడిగా భావించే పోతురాజు వేషధారణ కలిగిన పురుషులు కొరడా జూలిపిస్తూ డప్పు చప్పులతో నృత్యం చేస్తూ ఊరేగింపు ముందు నడుస్తారు.
రంగం భవిష్యవాణి.... పండుగ మరుసటి రోజు రంగం భవిష్యవాణి కార్యక్రమం జరుగుతుంది.
ఇందులో ఒక మహిళ పచ్చి మట్టి కుండ పై నిలబడి అమ్మవారి పూనకంతో భవిష్యత్తు విశేషాలను చెబుతుంది. ఆ తర్వాత ఘటాల ఊరేగింపుతో ఉత్సవాలు ముగుస్తాయి.
